క్రైస్తవ సోదరులకు ఖుర్'ఆన్ సందేశం:



క్రైస్తవ సోదరులకు ఖుర్'ఆన్ సందేశం:
_______________________________________


( I )  ముస్లిం - క్రైస్తవుల సామూహిక విశ్వాసాలు;

1. దేవుడు ఒక్కడే అని విశ్వసిస్తారు;

2. విగ్రహారాధన గొప్ప పాపంగా భావిస్తారు; 

3.  దైవేతరులకు సమర్పించింది తినరు; 

4.  దైవ గ్రంధాలను విశ్వసించాలని భావిస్తారు;

5. దైవ ప్రవక్తలను విశ్వసించాలని భావిస్తారు; 

6. యేసు (అ.స) వారిని విశ్వసించాలని భావిస్తారు; 

7. యేసు (అ. స) వారి పుట్టుక తండ్రి లేకుండానే జరిగిందని విశ్వసిస్తారు; 

8. యేసు (అ.స) దైవాన్ని ప్రార్ధించి చనిపోయినవారిని బ్రతికించారని, రోగులను స్వస్థత కలిగించారని ఇంకా అనేక అద్భుతాలు చేశారని విశ్వసిస్తారు; 

9. యేసు (అ.స) రెండవ రాకడను విశ్వసించడం; 

10. ప్రళయం, తీర్పుదినమును విశ్వసిస్తారు; 

11. నిత్యజీవం (స్వర్గం) - నిత్య మరణం (నరకం) ను విశ్వసించడం; మొదలైనవి ఉన్నాయి.

( II ) క్రైస్తవులతో ముస్లింల మరికొన్ని ప్రత్యెక సంబంధాలు;

1. క్రైస్తవుల భోజనం మీకు ధర్మ సమ్మతం. మీ భోజనం వారికి ధర్మ సమ్మతం; 

2. వారి స్త్రీలను మీరు వివాహం చేసుకోవచ్చు. అలాగే మీ పురుషులను వారికిచ్చి వివాహం చేయడం ధర్మసమ్మతమే . 

కేవలం విశ్వాలతోనే సరిపుచ్చక బంధుత్వ సంబంధాలు సయితం ఏర్పరచి మరింత సన్నిహితం చేసింది దివ్య ఖుర్'ఆన్  


( III ) వాస్తవానికి క్రైస్తవులు; ముస్లిములు ఎవరు? 

మొట్టమొదటి దంపతులైన ఆదం (అ.స) - హవ్వా (అ.స) ల సంతానమే పూర్తి మానవాళి. వీరి సంతానపు పరంపరలోనే ఇబ్రాహీం (అ.స). వీరి సంతానమైన ఇస్మాయీల్ (అ.స) నుండి ముస్లిములు-ఇస్హాఖ్ (అ.స) నుండి - క్రైస్తవులు అని భావిస్తారు. ఈ రెండు సమూహాలు పరస్పరం సోదరులు; 

IV. ఇబ్రాహీం (అ.స) ఎవరు? ఆయన ధర్మమేమిటి?

ఇబ్రాహీం (అ.స) లో ఆయన సహచరులలో మీకై ఒక మంచి ఆదర్శం ఉన్నది. వారు తమ జాతివారితో స్పష్టంగా అన్నారు; 'మీ పట్ల, దేవుణ్ణి వదలి మేరు పూజించే ఇతర దైవాల పట్ల మేము పూర్తిగా విసిగిపోయాము. మేము మిమ్మల్ని తిరస్కరించాము. మీరు ఏకైక ప్రభువైన అల్లహ్ ను విశ్వసించనంత వరకు మాకూ మీకూ మధ్య విరోధాలు, విద్వేషాలు ఉండిపోతాయి. అయితే ఇబ్రాహీం (అ.స) తన తండ్రితో ఇలా అనడం, "నేను మీ మన్నింపు కొరకు తప్పకుండ అల్లహ్ కు విన్నవిస్తాను. మీ కొరకు అల్లహ్ నుండి మరేది పొందే అధికారం నాకు లేదు. (60:4) ఇబ్రాహీం (అ.స) విధానాన్ని ద్వేషించే వాడెవడు - తనను తాను అజ్ఞానానికి, అహంభావానికి గురి చేసుకున్నవాడు తప్ప ప్రపంచంలో మా సేవకొరకు మేము ఎన్నుకున్న వ్యక్తి ఇబ్రాహీం (అ.స). పరలోకంలో ఆయన సజ్జనులతో పాటు ఉంటారు. ఆయన ఎలాంటి వాడంటే, "ముస్లిం అయిపో" అని అతని ప్రభువు అతనితో అన్నప్పుడు అతను వెంటనే, నేను విశ్వప్రభువు యొక్క "ముస్లిం" అయిపోయాను. అని జవాబు పలికాడు. ఇదే మార్గంలో నడవండి అని ఇబ్రాహీం తన సంతానానికి హితోపదేశం చేశాడు. ఈ ఉపదేశాన్ని యాఖూబ్ (అ.స) కూడా తన సంతానానికి చేశారు. "నా బిడ్డలారా! ఈ ధర్మాన్నే అల్లహ్ మీ కొరకు ఎన్నిక చేశాడు. కనుక మీరు మరణించేవరకూ ముస్లిములు (విధేయులు) గానే ఉండండి." (ఖుర్'ఆన్ 2:130-132)

"గ్రంధ ప్రజలారా! ఇబ్రాహీం ధర్మం గురించి మీరు ఎందుకు తగాదా పడుతున్నారు? తౌరాత్, ఇంజీల్ గ్రంధాలు ఇబ్రాహీం తర్వాతేగా అవతరించాయి. మీరు ఈ స్వల్ప విషయాన్ని కూడా అర్ధం చేసుకోరా? మీకు తెలిసిన విషయాలను గురించి మీరు బాగా వాదించారు. కానీ మీకు తెలియని విషయాలను గురించి కూడా మీరు ఇప్పుడు ఎందుకు వాదిస్తున్నారు? అల్లహ్ కు తెలుసు కాని మీకు తెలియదు. ఇబ్రాహీం యూడుడు కాదు, క్రైస్తవుడు కాదు. అతను అచంచలమైన విశ్వాసముగల ముస్లిం (దైవవిదేయుడు). అతను ఎంతమాత్రమూ ముష్రికులలోని వాడు కాదు. ఇబ్రాహీం (అ.స) తో సంబంధం కలిగి ఉండే హక్కు ఎవరికైనా ఉందీ  అంటే,అది ఆయన్ని అనుసరించిన ప్రజలకు మాత్రమే. ఇప్పుడు ఈ ప్రవక్తా, ఈయన్ని విశ్వసించేవారు ఆసంబంధానికి అందరికంటే ఎక్కువగా అర్హులు. కేవలం విశ్వసించేవారికే అల్లహ్ అండ దండలు లభిస్తాయి.     (ఖుర్'ఆన్ ; 3:65-68) 

పై వాక్యాల ప్రకారం ఏకేశ్వరవాదియైన ఇబ్రాహీం (అ.స) పేరుతొ గర్వ పడే హక్కు, ఎఒక్కరికీ లేదు. ఆయనను అనుసరించే వారికి తప్ప. ఇబ్రాహీం (అ.స) ధర్మాన్ని శ్వీకరించడం అంటే ఇబ్రాహీం (అ.స) ప్రభువైన అల్లహ్ కు మాత్రమే ముస్లిములుగా (విధేయులుగా) జీవించేవారు అసలు ఇబ్రాహీం (అ.స) వారసులు అని స్పష్టమౌతుంది. 

V. గ్రంధ ప్రజలలో కొందరు ఎలాంటి వారు?

గ్రంధ ప్రజలందరూ ఒకలాంటి వారు కాదు. వారిలో సత్య మార్గంలో స్థిరంగా ఉన్నవారు కూడా కొందరు ఉన్నారు. వారు రాత్రి సమయాలలో అల్లహ్ ఆయత్ లను పఠిస్తారు. ఆయన ముందు సజ్దా చేస్తారు. అల్లాహ్ ను, అంతిమ దినాన్ని విశ్వసిస్తారు. మంచిని చేయండి అని అగ్నాపిస్తారు. చెడులనుండి ఆపుతారు. సత్కార్యాలలో ఎల్లప్పుడూ చురుకుగా ఉంటారు. వారు సజ్జనులు. వారు చేసే ఏ మంచి పనులకైనా విలువను ఇవ్వక పోవడం జరగదు. భయ భక్తులు కలవారిని అల్లహ్ బాగా ఎరుగును. (ఖుర్'ఆన్ 3:113-115)

గ్రంధ ప్రజలలో కూడా కొందరు అల్లహ్ ను విశ్వసిస్తారు. నీ వైపునకు పంపబడిన ఈ గ్రంధాన్ని విశ్వసిస్తారు. అల్లహ్ సమక్షంలో వినమృలౌతారు. అల్లహ్ ఆయత్ లను స్వల్పమైన మూల్యానికి అమ్మరు. వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంది. అల్లహ్ లెక్క తీసుకోవడంలో ఆలస్యం చెయ్యడు. (ఖుర్'ఆన్ 3:119)

గ్రంధ ప్రజలందరూ ఒకలాంటి వారు కాదు. కొందరు అల్లహ్ ను, పరలోకాన్ని విశ్వసించడమే కాకుండా దివ్య ఖుర్'ఆన్ ను విశ్వసిస్తారని, మంచిని చేయమని ఆజ్ఞాపిస్తారని చెడునుండి వారించడం కూడా చేస్తారని ఖుర్'ఆన్ సాక్ష్యమిచ్చింది. 

VI. మేము వరుసగా ప్రవక్తలు పంపాము. వారందరి తర్వాత మర్యం కుమారుడైన ఈసాను ప్రభవింప జేశాము. ఆయనకు ఇంజీల్ ను ప్రసాదించాము. ఆయనను అనుసరించిన వారి హృదయాలలో మేము జాలిని, కరుణను కలిగించాము. వైరాగ్యాన్ని వారు స్వయంగా కనిపెట్టారు. మేము దానిని వారిపై విధించలేదు. కానీ అల్లహ్ ప్రసన్నతను పొందటానికి వారే స్వయంగా సృష్టించారు. తరువాత దానిని పాటించే విషయంలో న్యాయం చేకూర్చ లేకపోయారు. వారిలో విశ్వసించిన వారికి మేము ప్రతిఫలాన్ని ప్రసాదించాము. కాని వారిలో పలువురు అవిదేయులు. (ఖుర్'ఆన్ ; 57:27) 

"విస్వాసుల పట్ల విరోధం విషయం లో, నీవు యూదులనూ, ముష్రికులనూ అందరికంటే ఎక్కువ ప్రచండులుగా కనుగొంటావు. విశ్వాసుల పట్ల మైత్రి విషయంలో, 'మేము క్రైస్తవులం' అని అన్నవారిని అత్యంత సన్నిహితులుగా చూస్తావు. దీనికి కారణం ఏమిటంటే వారిలో దైవ భక్తీ గల విద్వాంసులు, ప్రపంచాన్ని త్యజించిన సన్యాసులు ఉన్నారు. ఇంకా వారిలో అహంభావం లేదు. ప్రవక్త పై అవతరించిన ఈ గ్రంధాన్ని (ఖుర్'ఆన్) ను వారు విన్నప్పుడు, సత్యాన్ని గ్రహించిన కారణంగా వారి కళ్ళు అశ్రువులతో చెమ్మ గిల్లటం నీవు చూస్తావు. వారు ఇలా అనేస్తారు; "ప్రభూ! మేము విస్వసించాము. మా పేర్లను సాక్ష్యం ఇచ్చే వారిలో వ్రాయి." ఇంకా వారు ఇలా అంటారు. " మా ప్రభువు మమ్మల్ని సజ్జనులలో చేర్చాలనే ఆకాంక్ష మాకు ఉన్నప్పుడు మేము అల్లాహ్ ను ఎందుకు విశ్వసించ కూడదు?" వారు ఇలా పలికిన కారణంగా అల్లాహ్ వారికి క్రింద కాలువలు ప్రవహించే ఉద్యానవనాలను ప్రసాదించాడు. వారు అక్కడ కలకాలం ఉంటారు. సద్వర్తనులకు లభించే ప్రతిఫలం ఇది. ఇక మా వాక్యాలను స్వీకరించడానికి తిరస్కరించే వారూ, వాటిని అసత్యాలుగా చిత్రించి నిరాకరించేవారు నరకానికి అర్హులు." 
(ఖుర్'ఆన్; 5:82-86)

ఈ వాక్యాల ప్రకారం క్రైస్తవులలో చాలామంది అల్లహ్ పట్ల భయభక్తులు ఉన్న కారణంగా ఈ సందేశాన్ని (ఖుర్'ఆన్ సందేశాన్ని) వినగానే సత్యాన్ని  గ్రహించి,దీనిని స్వీకరించడమే గాక, సాక్ష్య్లుగ అయిపోయారు. 

VII . క్రైస్తవ పండితులలో కొందరు ఎలాంటి వారు? 

ఈ గ్రంధ ప్రజల యొక్క చాలా మంది పండితుల స్థితి, సన్యాసుల పరిస్థితి ఎటువంటిదంటే, వారు ప్రజల సొమ్మును అక్రమ పద్ధతుల ద్వారా తినేస్తారు. వారిని అల్లాహ్ మార్గం అనుసరించ కుండా ఆపుతారు. వెండి బంగారాలను పోగుచేసి వాటిని దైవమార్గంలో ఖర్చుపెట్టని వారికి వ్యధాభరితమైన శిక్ష యొక్క శుభవార్తను అందజేయండి. ఈ వెండి బంగారాలు నరకాగ్నిలొ కాల్చబడే ఒక రోజు వస్తుంది. వాటితోనే వారి నొసటిపై, వారి పార్శ్వాలపై, వీపులపై వాతలు వెయ్య బడతాయి. ఇది మీరు మీ కొరకు కూడా బెట్టుకున్నది. ఇదిగో మీరు కూడబెట్టిన సంపదను రుచి చూడండి. (అని చెప్పడం జరుగుతుంది). (ఖుర్'ఆన్ ; 9:34-35)  

ఈ వాక్యం ప్రకారం కొందరు పండితులు దశమభాగములను, కానుకలను ప్రోగుచేసి అల్లాహ్ మార్గంలో ఖర్చుపెట్టక పోవడమేగాక కనీస అవసరాలు తీరని వారి కొద్దిపాటి సంపాదనను సయితం అక్రమ పద్ధతుల ద్వారా అంటే భయ ప్రమాదాలు, మరియు ఆశలు కల్పించి దోచుకుంటారని వారి సంపాదన వారికి ఒకరోజున శిక్షకు కారణ భూత మవుతుందని అవగతమౌతుంది. రక్షణ పొందగోరే పండితులు వెంటనే పశ్చాత్తాపముతో మళ్ళీ మారు మనసుపొంది, అన్యాయంగా దోచుకున్న ధనాన్ని అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడితే అల్లాహ్ ను క్షమించే వాడుగా, కరుణించే వాడుగా చూస్తారు. 

VIII. క్రైస్తవులు ఎవరిని అనుసరిస్తున్నారు? 

వారితో ఇలా అను: "ఇదేమిటి, మీరు అల్లాహ్ ను వదలి మీకు నష్టంగాని, లాభంగాని కలిగించే అధికారం లేని దానిని పూజిస్తున్నారు? అందరిదీ వినేవాడు, అంతాతెలిసిన వాడూ అల్లాహ్ మాత్రమే. "ఇలా చెప్పు: గ్రంధ ప్రజలారా! మీ ధర్మం విషయంలో అన్యాయంగా హద్దులు మీరి ప్రవర్తించకండి. మీకు పూర్వం స్యయంగా తాము మార్గ భ్రష్టులై, ఇంకా చాలామందిని మార్గ భ్రషులుగా చేసి, ఋజుమార్గం తప్పినవారి ఊహాపోహాలను అనుసరించకండి. (ఖుర్'ఆన్ ; 5:76,77)

వారు అల్లాహ్ ను కాదని తమ పండితులను, తమ సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారు. ఇంకా ఇదే విధంగా మర్యం కుమారుడైన మసీహ్ ను కూడా. (ఖుర్'ఆన్ ; 9:31)

క్రైస్తవులు చాలా మంది గ్రుడ్డిగా వారి పండితుల ఆజ్ఞలను దైవ ఆజ్ఞలుగా, పాస్టర్ల బోధనలను యేసు బోధనలుగా భ్రమిస్తున్నారు. మార్గం తప్పిన, లేఖన, వాక్య ఆధారాలు లేని వారి ఊహాపోహాలనుండి బయట పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఉదాహరణకు, దేవుడు త్రిత్వమని, యేసు దేవుడని, ధర్మశాస్త్రం కొట్టివేయబడినదని, ఇటువంటి మౌలిక విశ్వాసాలనే ధర్మ విరుద్ధంగా నేడు బోధిస్తున్నారు. వాస్తవానికి యేసు వారు ఎప్పుడూ ఆ విధంగా బోధించలేదు. 

IX. కొందరు అవిశ్వాసులు ఎలాఅయ్యారు?

మర్యం కుమారుడైన మసీహ్ యే దేవుడు అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడ్డాడు. ప్రవక్తా! వారితో ఇలా అను అల్లాహ్ గనుక మర్యం కుమారుడైన మసీహ్ ను, ఆయన తల్లినీ, సమస్త భూలోకవాసులనూ నాశనం చేయ్యగోరితే ఆయన తన సంకల్పాన్ని విరమించుకునేలా చేసే శక్తి ఎవరికుంది? అల్లాహ్ భూమికీ, ఆకాశాలకు వాటి మధ్యనున్న సమస్తానికీ ప్రభువు. తానూ కోరిన దానిని సృష్టిస్తాడు. ఆయన అధికారం ప్రతి వస్తువును లోబరుచుకుని ఉంది. (ఖుర్'ఆన్ 5:17)

అల్లాహ్ ముగ్గురిలో ఒకడు అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినవారు. వాస్తవమేమిటంటే, దేవుడు ఒక్కడే మరొక దేవుడు లేడు. వారు గనుక తమ ఈ మాటలను మానుకోకపోతే వారిలో అవిశ్వాసానికి ఒడిగట్టినవారికి వ్యధాభరితమైన శిక్ష పడుతుంది. అయితే వారు అల్లాహ్ వైపుకు మరలరా?  క్షమించు అని ఆయనను వేడుకోరా?  అల్లాహ్ అమితంగా మన్నించేవాడు కరుణించేవాడునూ. (ఖుర్'ఆన్ ; 5:73,74)

ఇస్రాయీలు వంశస్థుల అవిశ్వాసాన్ని, తిరస్కారాన్ని పసిగత్తినప్పుదు ఈసా ఇలా అన్నారు; "అల్లాహ్ మార్గంలో నాకు సహాయకులుగా ఎవరు ఉంటారు? అప్పుడు హవ్వారీలు ఇలా జవాబు పలికారు - మేము అల్లాహ్ కు సహాయకులం. మేము అల్లాహ్ ను విశ్వసించాము. మేము ముస్లిములు (అల్లాహ్ విధేయులం) అనే విషయానికి మీరు సాక్షిగా ఉండండి. ప్రభూ నీవు అవతరింపజేసినా ఆజ్ఞను మేము విశ్వసించాము. సందేశహరుణ్ణి అనుసరించడానికి మేము అంగీకరించాము. మా పేర్లు సాక్షుల జాబితాలో వ్రాయి. (ఖుర్'ఆన్ ; 3:52-53)

ఇశ్రాయీలు సంతతి వారిలో అవిశ్వాస మార్గం అవలబించిన వారిని దావూద్ నోట మర్యం కుమారుడైన మసీహ్ నోట శపించడం జరిగింది. ఎందుకంటే వారు అవిదేయులయారు, అత్యాచారాలు చేయసాగారు. చెడుపనులు చెయ్యకుండా వారు ఒకరినొకరు నిరోధించడం మానివేశారు. వారు అవలబించిన మార్గం చాలా చెడ్డది. (ఖుర్'ఆన్ ; 5:78,79)

పై వాక్యాల ప్రకారం యేసు సందేశాన్ని విస్మరించి అవిశ్వాసానికి పాల్పడిన ఇశ్రాయీలు ప్రజలు శాపానికి గురైతే మరొక ప్రక్క యేసు దేవుడని, యెహోవా ముగ్గురిలో ఒకడని చెప్పి చాలా మంది క్రైస్తవులు అవిశ్వాసానికి పాల్పడుతున్నారు. ఇప్పుడైనా అవిశ్వాసమునుండి విశ్వాసము వైపునకు ఏకేశ్వరుడైన అల్లాహ్ వైపునకు మరలిన క్రైస్తవులకు అల్లాహ్ మన్నించే వాడు, క్షమించే వాడని తెలుపడం జరిగింది. 

X. దేవునికి కుమారుడు ఉన్నాడా?

అల్లాహ్ ఒకరిని తన కుమారునిగా చేసుకున్నాడు అని వారు అంటారు. కాని అల్లాహ్ ఈ విషయాలకు అతీతుడు. ఆయన అత్యంత పవిత్రుడు. అసలు యదార్ధం ఏమిటంటే, భూమ్యాకాశాలలో ఉన్నవన్నీ ఆయన సొంతమే. అవన్నీ ఆయన యెడల విధేయతకు అంకితమైనవే. ఆయన ఆకాశాలకూ, భూమండలానికీ సృష్టికర్త. తాను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, ఆయన దానిని కేవలం అయిపో అని ఆజ్ఞాపిస్తాడు. అది వెంటనే అయిపోతుంది. (ఖుర్'ఆన్ ; 2:116,117) 

తెలియకపోయినా వారు ఆయనకు కొడుకులను, కూతుళ్ళను కల్పించారు. యదార్ధానికి ఆయన అత్యంత పరిశుద్ధుడు. వారు చెప్పే ఈ మాటలకు అతీతుడు. ఆయన ఆకాశాలనూ, భూమినీ ప్రభవింపజేసినవాడు. ఆయనకు ఒక జీవిత సహచరి అంటూ లేనప్పుడు ఆయనకు కుమారుడు ఎలా ఉంటాడు? ఆయన ప్రతీ వస్తువును పుట్టించాడు. ఆయనకు ప్రతీ వస్తువును గురించి తెలుసు. (ఖుర్'ఆన్ ; 6:101,102)

ఉజైర్ అల్లాహ్ కుమారుడు అని యూదులు అంటారు. మసీహ్ అల్లాహ్ కుమారుడు అని క్రైస్తవులు అంటారు. వారికి పూర్వం అవిశ్వాసంలో పడి ఉన్నవారి మాటలను అనుకరిస్తూ వారు తమ నోటితో అనే ఈ మాటలు నిరాధారమైనవి. (ఖుర్'ఆన్ ; 9:30) 

అల్లాహ్ ఎవరినో కొడుకుగా చేసుకున్నాడు అని ప్రజలు అన్నారు, సుబ్హానల్ల్లాహ్ ఆయన ఏ అక్కరా లేనివాడు. ఆకాశాలలో, భూమిలో ఉన్నదంతా ఆయన ఆస్తియే. ఈ మాటకు అసలు మీ వద్ద ఉన్న నిదర్శన మేమిటి? అల్లాహ్ ను గురించి మీకు తెలియని మాటలంటున్నారా? ప్రవక్తా! ఇలా ప్రకటించు: అల్లాహ్ కు అబద్దాలను అంటగట్టే వారు ఎన్నటికీ సాఫల్యాన్ని పొందలేరు. కొన్ని రోజుల ఇహలోక జీవితంలో సుఖాలను అనుభవించ వచ్చును, కానీ తరువాత మా వైపునకే వారు మరలి రావాలి. అప్పుడు మేము వారి అవిశ్వాసానికి ప్రతిఫలంగా వారికి కఠిన బాధను రుచి చూపిస్తాము. (ఖుర్'ఆన్ ; 10:68-70)

అల్లాహ్ మాత్రమే స్తుతింప దగినవాడు, ఆయన తన దాసునిపై ఈ గ్రంధాన్ని అవతరింప జేశాడు. అందులో ఏ విధమైన వక్రత్వాన్నీ ఉంచలేదు. అది సూటిగా ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించే గ్రంధం. దాని ద్వారా అతను దేవుని కఠిన శిక్షను గురించి ప్రజలను హెచ్చరించాలని, విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి మంచి ప్రతిఫలం లభిస్తుంది అనే శుభవార్తను, అందులోనే వారు కలకాలం ఉంటారు అనే శుభవార్తను, అందజేయాలని, అల్లాహ్ ఎవరినో కుమారుడుగా వరించాడు అని పలికే ప్రజలను భయపెట్టాలని. ఈ విషయం గురించి వారికి గానీ, వారి తాత ముత్తాతలకు గానీ ఏ జ్ఞానమూ లేదు. వారి నోట వెలువడే ఈ మాట అత్యంత దారుణమైనది. వారు కేవలం అబద్దాన్ని మాత్రమే పలుకుతున్నారు. (ఖుర్'ఆన్; 18:1-5) 


XI. యదార్ధానికి యేసు ఎవరు?

గ్రంధ ప్రజలారా! మీ ధర్మ విషయాలలో అతిగా ప్రవర్తించకండి. అల్లాహ్ కు సత్యం తప్ప వేరే విషయాన్ని ఆపాదించకండి. మసీహ్ -  మర్యం కుమారుడైన ఈసా, అల్లాహ్ పంపిన ఒక ప్రవక్త. అల్లాహ్ మర్యం వైపునకు పంపిన ఒక ఆజ్ఞ . అల్లాహ్ తరపునుండి వచ్చిన ఒక ఆత్మా తప్ప మరేమీ కాదు. కనుక అలాహ్ ను, ఆయన ప్రవక్తలను విశ్వసించండి. ముగ్గురు అని అనకండి. ఇలా అనడం మాని వెయ్యండి. ఇది మీకే శ్రేయస్కరం. అల్లాహ్ ఒక్కడే దేవుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయనకు ఒక కొడుకు ఉన్నాడనే విషయానికి ఆయన అతీతుడు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయన ఆస్తియే. దాని పోషణకు, దాని రక్షణకు ఆయనే చాలు (ఖుర్'ఆన్ 4:171)

మర్యమ్ పుత్రుడైన మసీహ్, ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదు. ఆయనకు పూర్వం కూడా ఎంతోమంది ప్రవక్తలు గతించారు. ఆయన తల్లి సద్గుణసంపన్నురాలు. వారు ఉభయులు భోజనం చేసేవారు - చూడండి ! మేము వారి ముందు యదార్ధానికి సంబంధించిన సూచనలను ఎలా విశదీకరిస్తామో చూడండి ! అయినా వారు సన్మార్గం తప్పి ఎటుపోతున్నారో. (ఖుర్'ఆన్ ; 5:157)

XII. యేసు వారిచ్చిన శుభవార్త ఏమిటి?  
మర్యమ్ కుమారుడు ఈసా అనిన మాటలను జ్ఞాపకం తెచ్చుకో, ఓ ఇశ్రాయీల్ సంతతి వారలారా! నేను మీ వద్దకు అల్లాహ్ చే పంపబడిన సందేశహరుణ్ణి. నాకు పూర్వం వచ్చిన తౌరాత్ గ్రంధాన్ని ధృవపరుస్తున్నాను. నాతరువాత అహ్మద్ అనే ప్రవక్త రాబోతున్నాడు, అనే శుభవార్తను అందజేస్తున్నాను. (ఖుర్'ఆన్ ; 61:6) 

XIII. యేసు వారు చేసిన హెచ్చరిక ఏమిటి? 

మర్యమ్ కుమారుడైన ఈసా ! నీవు మానవులతో "అల్లాహ్ ను కాదని నన్నూ, నా తల్లిని దేవుళ్ళుగా భావించండి. " అని బొధించావా? అని అడిగినప్పుడు అతను ఇలా మనవి చేసుకుంటాడు: నీవు అత్యంత పవిత్రుడవు. ఏ మాటను అనే హక్కు నాకు లేదో ఆ మాటను అనటం నాకు యుక్తమైన పనికాదు. ఒకవేళ నేను ఆవిధంగా అని ఉంటె, అది నీకు తప్పకుండ తెలిసి ఉండేది. నా మనస్సులో ఏముందో నీకు తెలుసు. నీ మనస్సులో ఏముందో నాకు తెలియదు. నీవు గుప్తంగా ఉన్న యదార్దాలనీ తెలిపిన మహాజ్ఞానివి. నీవు ఆదేశించిన దానిని తప్ప దేనినీ నేను వారికి చెప్పలేదు. అది ఏమిటంటే "అల్లాహ్ ను ఆరాధించండి. ఆయన నాకూ ప్రభువే, మీకో ప్రభువే ." (ఖుర్'ఆన్ ; 5:115-117)

XV. క్రైస్తవ సోదరులకు ఆహ్వానం !

ప్రవక్తా! ఇలా చెప్పు: "గ్రంధ ప్రజలారా! మాకూ మీకూ మధ్య సమానమైన ఒక విషయం వైపునకు రండి. మనం అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ దాస్యం చెయ్యరాదు. మనలోని వారెవ్వరూ అల్లాహ్ ను తప్ప మరెవ్వరినీ తమ ప్రభువుగా చేసుకోరాదు అనేది." ఈ సందేశాన్ని స్వీకరించడానికి వారు వైముఖ్యం కనబరిస్తే, వారితో స్పష్టంగా ఇలా అను : "మేము ముస్లిములము (కేవలం అల్లాహ్ కె దాస్యం చేసేవారు, విధేయత చూపేవారు) అనే విషయానికి సాక్ష్యులు గా ఉండండి. 

XVI. క్రైస్తవ సమాజానికి అంతిమ దైవ గ్రంధమైన దివ్య ఖుర్'ఆన్ 


ఇచ్చే సందేశంలో ముఖ్యాంశాలు:


  1. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను మాత్రమే ఏకైక సృష్టికర్తగా అంగీకరించాలి, ఆరాధించాలి. 
  2. యేసును కుమారునిగా కాక, ప్రవక్తగా మరియు మెసెయ్యగా అంగీకరించాలి. 
  3. యేసు రక్తము ద్వారా కాక యేసు బోధనలను గైకొనుట ద్వారా రక్షణ కలుగుతుందని విశ్వసించాలి. 
  4. తౌరా (మోషే ధర్మశాస్త్రం) లో మోషే ద్వారా మరియు ఇంజీలు లో యేసు ద్వారా ఆ ప్రవక్తగా, ఆదరణ కర్తగా, రానైయున్న ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) ను గురించి భూతకాలంలోనే ప్రవచింపబదియున్నది. కాబట్టి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) ను అంతిమ దైవ ప్రవక్తగా విశ్వసించి అనుసరించాలి. 







  

No comments:

Post a Comment